బీజింగ్ : భారత్-చైనాలు భాగస్వాములుగా ఉండాలనే అంశంపై జిన్ పింగ్ మోదీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని చైనా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగిన భేటీల చైనా, భారత్లు భాగస్వాములుగా ఉండాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చైనా-భారత్ సంబంధాలకు సంబంధించిన వ్యూహాత్మక, దీర్ఘకాలిక , దిశానిర్దేశక అంశాలపై ఇద్దరు నాయకులు బహిరంగంగా, లోతుగా అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. చైనా, భారత్లు భాగస్వాములుగా ఉండాలన్నదే వారి మధ్య కుదిరిన అత్యంత ముఖ్యమైన ఏకాభిప్రాయమని వాంగ్ చైనా అధికారిక మీడియాకు చెప్పారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్బ్యూరో సభ్యుడు కూడా అయిన వాంగ్ తెలిపిన వివరాల ప్రకారం చైనా , భారత్లు ఒకరి బలాలను మరొకరు వినియోగించుకుంటూ పరస్పరం మద్దతు ఇచ్చుకుంటూ, విజయ సాధనలో సహాయపడుతూ ఉమ్మడి అభివృద్ధిని సాధించగలవని పేర్కొన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని, ప్రశాంతతను సంయుక్తంగా కాపాడేందుకు ఇరు దేశాల నాయకులు అంగీకరించారని, అలాగే బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టే క్రమంలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటారని వాంగ్ తెలిపారు. మోదీ జిన్ పింగ్ సమావేశం అంతర్జాతీయంగా విస్తృత దృష్టిని ఆకర్షించిందని ఆయన అన్నారు. ఇరు దేశాల నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో, చైనా-భారత్ సంబంధాలు క్లిష్ట దశ నుండి క్రమంగా బయటపడి పునః ప్రారంభం నుండి కొత్త స్థాయికి చేరుకునేలా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య సహకార రంగాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. వాణిజ్య పరిమాణం రికార్డు స్థాయికి చేరుకుందని, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు మరింత చురుకుగా మారుతున్నాయని తెలిపారు. చైనా-భారత్ సంబంధాల మెరుగుదల, అభివృద్ధిని ఇరు దేశాలలోని 280 కోట్లకు పైగా ప్రజలు స్వాగతించడమే కాకుండా, ఇది గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన స్తంభంగా నిలుస్తుందని వాంగ్ అన్నారు.
