అమరావతి : పిల్లలు చదువుపై దృష్టి సారించాలని వారే తల్లిదండ్రులకు నిజమైన ఆస్తి అని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం మన్యం పార్వతిపురం జిల్లా భామినిలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణాన్ని సందర్శించారు మంత్రి నారా లోకేష్ తో కలిసి. విద్యార్ధుల కోసం పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, క్రీడా ప్రాంగణం గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. స్టెమ్ ల్యాబ్ పరిశీలించి బాగుందంటూ కితాబు ఇచ్చారు. ఈ సందర్బంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లో సీఎంకు విద్యార్థినుల ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్ ఇచ్చిన తీరును అభినందించారు సీఎం. అనంతరం పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. పిల్లలను బాగా చదివించాలని, వాళ్లకు మీరు అందించే ఆస్తి చదువేనని అన్నారు.
గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కానీ తాము వచ్చాక మార్పులు చేశామన్నారు. విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టామన్నారు సీఎం. పిల్లల కోసం నాణ్యమైన , రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. గతానికంటే చాలా బాగుందని చెప్పింది ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి. మిమ్మల్ని చూసి ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు. తమ ప్రాంతానికి తరుచూ వస్తూ ఉండాలని కోరారు. ఓ క్లాస్ రూంలో కూర్చొని క్లికర్ విధానాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. రెయిన్ ఫాల్ పై వీడియో ప్రదర్శించారు. దాని ఆధారంగా ప్రశ్నలు కురిపించారు. మంచి మార్కులు వచ్చిన వారికి చప్పట్లు కొట్టించారు నారా చంద్రబాబు నాయుడు.
