చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనంగా మారారు. ఆయన తన మంత్రివర్గంలోకి 9 మందిని తీసుకున్నారు. వారిలో ఒకరు మహిళ ఉన్నారు. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఆయన నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ముందుగా డీజీపీతో శాంతి భద్రతలపై సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ఫోకస్ పెట్టాలన్నారు. ప్రధానంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడు దేశంలోనే నెంబర్ వన్ గా మారాలని స్పష్టం చేశారు. ఎవరు ఇందులో ప్రమేయం ఉన్నా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎవరైనా సరే అరెస్ట్ చేయాలని అన్నారు. దీంతో ఆయన లా అండ్ ఆర్డర్ పట్ల చాలా సీరియస్ గా ఉన్నారని అర్థం అవుతోంది.
అంతకు ముందు చాలా డిఫరెంట్ గా కనిపించారు జోసెఫ్ విజయ్. మెడలో టై లేకుండా తెల్ల చొక్కా, ముదురు రంగు సూట్లో కనిపించిన విజయ్, ఇన్నేళ్లుగా సంప్రదాయ బద్ధంగా తెల్ల ధోవతి, చొక్కా ధరించి వస్తున్న రాష్ట్రంలోని సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా కనిపించారు. రాజకీయ ప్రసంగాలకు సంబంధించిన సాధారణ వాక్చాతుర్యం లేకుండా ఆయన విభిన్నంగా మాట్లాడారు. తమిళనాడు ప్రజల అఖండ మద్దతుతో తమ పార్టీ కోరుకున్నది ఏదైనా సాధించగలదని ఆయన అన్నారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేయకుండా, చేయగలిగినది చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సినిమాల్లో కష్టపడే ఒక సహాయ దర్శకుడి కుమారుడిగా తన నిరాడంబరమైన గతాన్ని గుర్తు చేసుకున్నారు.


















