అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎండీసీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత గనులు, తవ్వకాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానం తదితర అంశాలపై నారా చంద్రబాబు నాయుడ సచివాలయంలో సమీక్షించారు. లీజుకు ఇచ్చిన గని ప్రాంతం కాకుండా ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. ఏపీ ఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలన్నారు. లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్ట్జ్, సిలికా శాండ్, క్లేస్, గ్రానైట్ లాంటి వివిధ ఖనిజాల ముడి సరుకును ఎగుమతి చేయడంతో పాటు వాటికి వాల్యూ యాడ్ చేయడం ద్వారా మరింత ఆదాయం రాబట్టాలని సూచించారు.
మాంగనీస్ ఖనిజం ద్వారా ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తులు, క్వార్ట్జ్-సిలికా శాండ్ ద్వారా సొలార్ ప్యానెళ్లు, సొలార్ పీవీ సెల్స్ ఉత్పత్తి, గ్లాస్ ఉత్పత్తులు, గ్రానైట్ ద్వారా కటింగ్-పాలిషింగ్ పరిశ్రమలు ప్రొత్సహించాలని అన్నారు సీఎం. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్ కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయాలని, విశాఖలో ఏర్పాటు కాబోయే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















