అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి హైదరాబాద్ లో తెలంగాణ వాదులు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు దోహద పడతాయని పేర్కొన్నారు. రాష్ట్రాలుగా విడి పోయినా తెలుగు వారంతా ఒక్కటేనని ఆ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఎక్కడికైనా వెళ్లేందుకు హక్కు ఉందని, ఇది భారత రాజ్యాంగం కల్పించిందని ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు నారా చంద్రబాబు నాయుడు.
ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించ కూడదన్నారు. ఇప్పటి వరకు విడి పోయినా అందరూ కలిసి అన్యోన్యంగా ఉన్నారని అన్నారు. కానీ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోతే ఎలా అని ప్రశ్నించారు సీఎం. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్ట లేరన్నారు.
ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు అన్నారు సీఎం. తెలంగాణ లోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నేను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చానని పేర్కొన్నారు . తమిళనాడుకు కర్నాటకతో పాటు ఆలిండియా నేతలతో పాటు అన్ని ప్రాంతాల నేతలు వచ్చారన్నారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారని తెలిపారు సీఎం.
















