విజయవాడ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మర్యాద పూర్వకంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్బంగా తమ రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. అధికారిక పత్రికను అందించారు. తనను ఆహ్వానించేందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ ఇద్దరూ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. బాబును కలిసిన అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడును ఆకాశానికి ఎత్తేశారు. ఆయనంతటి లీడరే లేడని పేర్కొన్నారు. ఆపై బాబును ఓ విజనరీ, దమ్మున్న లీడర్ గా ప్రశంసించారు. ఆనాడు జగన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేస్తే తాను ఒక్కడినే ఖండించానని, నిరసన తెలిపానని గుర్తు చేశారు. ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకోవద్దంటూ ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ కు, కేసీఆర్ కు, కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చానని చెప్పారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పై చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు.
