అమరావతి : దేశంలో పెట్టుబడులు ఎక్కువగా వస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ అని చెప్పక తప్పదు. 75 ఏళ్ల వయసులోనే నవ యువకులతో పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ అన్ని రంగాలలో టాప్ లో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో జరిపిన నిరంతర చర్చల వల్ల అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ట అమాంతం పెరిగింది. ఒక రకంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రియల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఏ ఇతర రాష్ట్రం చేయనంతగా ఏపీని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఆర్సెలార్ మిట్టల్ అధినేత ఆదిత్య మిట్టల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ ప్రెసిడెంట్, గూగుల్ సీఈఓల వంటి గ్లోబల్ లీడర్లు ఏపీ లీడర్షిప్, పారదర్శక పాలసీలపై స్వచ్ఛందంగా ప్రశంసల వర్షం కురిపించారు.
‘విజన్ 2047’ లో భాగంగా వరల్డ్ బ్యాంక్ నీతి ఆయోగ్ సాయంతో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను 3 మేజర్ ఎకనామిక్, రీజియన్స్గా డెవలప్ చేస్తున్నారు, ఇందులో భాగంగా వైజాగ్ ఎకనామిక్ రీజియన్ కింద 200 ఎకరాల విస్తీర్ణంలో 3 భారీ ఫుడ్ పార్కులను నెలకొల్పుతున్నారు. జేఎస్డబ్ల్యూ పార్కులో కూడా మెగా యూనిట్ వచ్చేలా చర్చలు జరిపారు. 100 శాతం ఆహార దిగుమతులపై ఆధారపడే దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ‘ఫుడ్ సప్లై హబ్’ గా మార్చేందుకు దుబాయ్ మంత్రులతో చర్చలు జరిపారు. . ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఈ ఏడాది నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్’ ను నిర్వహించబోతోంది.


















