న్యూఢిల్లీ : తమిళనాడుకు తీపి కబురు చప్పింది కావేరి వాటర్ రెగ్యులేషన్ కమిటీ ( సీడబ్ల్యూఆర్సీ). ఇప్పటికే తమకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ కర్ణాటక సర్కార్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ తరుణంలో సీడబ్ల్యూఆర్సీ స్పందించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తక్షణమే తమిళనాడుకు కావేరీ ప్రాజెక్టు నుంచి 15 రోజుల పాటు నీళ్లను విడుదల చేయాలని ఆదేశించింది. చైర్పర్సన్ వినీత్ గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఆదేశం జారీ చేయబడింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశం కూడా ఇదే రోజున జరగాల్సి ఉంది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని గతంలో కూడా కర్ణాటకను ఆదేశించింది. జూలై 28న జరిగిన సమావేశంలో, జూలై 29 నుండి 15 రోజుల పాటు బిలిగుండ్లు వద్ద 3,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా చూడాలని సీడబ్ల్యూఆర్సీ కర్ణాటకను ఆదేశించింది..
ఆ తర్వాత సీడబ్ల్యూఎంఏ ఈ ఆదేశాన్ని సమర్థిస్తూ దానిని పాటించాలని కర్ణాటకకు స్పష్టం చేసింది. అయితే నిర్ణీత పరిమాణంలో నీటిని విడుదల చేయడంలో కర్ణాటక విఫలమైందని తమిళనాడు ఆరోపించింది. తమిళనాడు ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం జూలై 29 , ఆగస్టు 2 మధ్య బిలిగుండ్లు వద్ద నమోదైన ప్రవాహం 158 క్యూసెక్కుల నుండి 550 క్యూసెక్కుల మధ్య ఉంది. ఈ సమస్యపై తమిళనాడు న్యాయపరమైన పోరాటం చేస్తున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. కావేరీ నదీ జలాల్లో తమ వాటాను తక్షణమే విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
కావేరీ నదీ జలాల్లో తమకు దక్కాల్సిన వాటా లభించడం లేదని తమిళనాడు తరఫు న్యాయవాది చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ , వి. మోహనాలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఇది విచారణకు ఈనెల 13న రానుంది.
