అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయ్య యాదవ్. రోజు రోజుకు విద్యుత్ ఛార్జీలపై మాట మారుస్తూ వచ్చారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేవలం బడా బాబులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా తను నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే విద్యుత్ చార్జీలపై చేస్తున్న కామెంట్స్ సత్యదూరంగా ఉన్నాయన్నారు. బిల్లుల మోతతో ఒకపక్క వాతలు పెడుతున్నాని ధ్వజమెత్తారు. సర్దుపోటుతో గుండెపోటు తెప్పిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. షాకుల మీద షాకులు ఇస్తూ ఇల్లు గుల్ల చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రామచంద్రయ్య యాదవ్. మరోపక్క ఛార్జీలు పెంచమని తేనె పూసిన కత్తి మాటలు చెప్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
ప్రస్తుత కూటమి పాలనలో ప్రజలపై మోపిన అధిక చార్జీల భారం రూ.15485 కోట్లు అని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్ల పాటు ట్రూ అప్ పేరుతో ప్రజల నెత్తిన పెను భారం మోపేందుకు సిద్దమయ్యారని వాపోయారు బీసీవై చీఫ్. యూనిట్ కు అదనంగా 40 పైసలు చొప్పున ముక్కుపిండి వసూలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తను పదే పదే మాట మీద నిలబడే వ్యక్తినంటూ చెప్పడం ఈ దశాబ్దంలోనే అతి పెద్ద జోక్ గా అభివర్ణించారు రామచంద్ర యాదవ్. తనకు మాట మీద నిలబడే తత్వమే ఉంటే, ఛార్జీల భారం ప్రజలపై పడొద్దని చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సర్దుబాటు భారం రూ.15485 కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
