BC Janardhan Reddy : నంద్యాల జిల్లా : అవుకు రిజర్వాయర్ సమస్యను సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామనని ప్రకటించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy). ఆదివారం ఆయన బనగానపల్లె నియోజకవర్గంలో అవుకు రిజర్వాయర్ పరిధిలో కుంగిన తిమ్మరాజు చెరువు రెవిట్మెంట్ ను పరిశీలించారు. అవుకు రిజర్వాయర్ మరమ్మత్తు పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించి, తగిన సూచనలు చేశారు. గత కొద్ది కాలంగా అవుకు రిజర్వాయర్ నుంచి చిన్న లీకేజీలతో నీరు బయటకు వస్తోందన్నారు. గతంలో ఈ లీకేజ్ గురించి నిపుణుల బృందం పరిశీలించి రిపోర్ట్ ఇచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
AP Minister BC Janardhan Reddy Comments
అందించిన పూర్తి నివేదికను ఆధారంగా చేసుకుని ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఈ మేరకు మరమ్మత్తులకు అత్యవసరంగా రూ. కోటి నిధులు మంజూరు చేశామని వెల్లడించారు మంత్రి. అందులో రూ. 68 లక్షలతో ఇప్పటికే టెండర్లు పిలిచి అగ్రిమెంట్ కూడా పూర్తి చేశామన్నారు. ఈ క్రమంలో గతంలో 1 మీటరు వరకు ఉన్న లీకేజ్ నేడు 3 మీటర్ల వరకు పెరిగిందన్నారు. అయితే స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమస్యను సీరియస్ గా తీసుకుని మరమ్మత్తు పనులను ప్రారంభించి ఈ లీకేజ్ నివారణను అడ్డుకుంటామని పేర్కొన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో మీడియా కూడా సంయమనం పాటించాలని కోరారు.
Also Read : Minister Ponnam Important Update : సర్కార్ బడి నూతన భవనం ప్రారంభానికి సిద్దం

















