హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ సోదరుల దేశభక్తిపై వ్యాఖ్యల విషయంపై స్పందించారు. ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపించడం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి అంశాలను ఎంఐఎం వ్యతిరేకించడం దేశభక్తి అనిపించు కుంటుందా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీ, సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల స్థాయిలోనే దేశభక్తులని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ కుమార్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపించడం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఎంఐఎం వ్యతిరేకించడం దేశభక్తి అనిపించు కుంటుందా అని ఆయన ప్రశ్నించారు.
“రేవంత్ రెడ్డి ‘దేశభక్తి పాఠశాల’కు స్వాగతం . ఇక్కడ వందేమాతరం సమయంలో బయటకు వెళ్లిపోవడం కూడా మీకు ‘డిస్టింక్షన్’ (విశిష్ట గుర్తింపు) తెచ్చిపెడుతుంది. సోనియా గాంధీకి వందేమాతరం పూర్తి గీతం పట్ల అసౌకర్యం ఉంది. వందేమాతరం పూర్తి గీతం ఆలపిస్తున్నప్పుడు ఒవైసీ , ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతారు అని ఆయన పేర్కొన్నారు. 2013లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ బండి సంజయ్ ఈ ప్రశ్న లు లేవనెత్తారు. ఆ ప్రసంగంలో, పోలీసులు లేకపోతే దేశంలో “హిందూ-ముస్లిం జనాభా నిష్పత్తి”ని సరి చేయడానికి తమకు కేవలం “15 నిమిషాలు” చాలునని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యాఖ్యలను దేశభక్తిగా పరిగణించవచ్చా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
కేంద్రం జాతీయ భద్రతా విధానాలపై ఒవైసీ సోదరులు పదేపదే చేస్తున్న విమర్శలు అలాగే హిందూ దేవుళ్లు, నమ్మకాలపై వారి వివాదాస్పద వ్యాఖ్యలను దేశభక్తిగా పరిగణించవచ్చా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒవైసీ కుటుంబానికి సంబంధించిన సంస్థలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. ఆ సంబంధాల గురించి సమాధానాలు కోరడం ఇప్పుడు దేశద్రోహం అవుతుందా అని ఆయన అన్నారు.
