హైదరాబాద్ : రాష్ట్రంలో ఓ వైపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ మరో వైపు రాత పరీక్షలు చేపడితే ఎలా అని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షను ఎలా నిర్వహిస్తారంటూ మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు అయితే ఓటుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాలా అని ఫైర్ అయ్యారు. ఈనెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.
అదే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తోందని అన్నారు . ఏపీపీ రాత పరీక్షలను జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ లో నిర్వహిస్తుండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి వెంటనే ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని, ఈనెల 14న తలపెట్టిన ఏపీపీ రాత పరీక్షలను తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

















