న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కుటుంబాల కోసం నోడల్ అధికారిని నియమించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. డీఎన్ఏ సరిపోలిక, పరిహార దావాలు, కుటుంబ సహాయం వంటి అంశాలను సమన్వయం చేయాలని విదేశీ వ్యవహారాల శాఖను కోరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన, అదృశ్యమైన లేదా గాయపడిన భారతీయుల కుటుంబాలకు సహాయం చేయడానికి విదేశీ వ్యవహారాల శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రాన్ని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ , న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం, మరణించిన వారి భౌతిక కాయాలతో కుటుంబ సభ్యుల DNA సరిపోలిక ప్రక్రియను సులభతరం చేయాలని కూడా MEAను ఆదేశించింది.
అలాగ రష్యా రాయబార కార్యాలయంలో పరిహార దావాలు దాఖలు చేయడంలో బాధితుల కుటుంబాలకు సహాయం చేయాలని, సంబంధిత సమాచారం, తాజా వివరాలను స్థానిక భాషల్లో అందించాలని కోరింది. తమ బంధువుల భౌతిక కాయాలను తిరిగి పొందడంలో , పరిహార దావాలను చేపట్టడంలో కుటుంబాలకు సహాయం అందించాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) , రాష్ట్ర న్యాయ సేవా సంస్థలను కూడా ధర్మాసనం ఆదేశించింది. కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణలో పోరాడటానికి నియమించబడిన తర్వాత మరణించిన లేదా అదృశ్యమైన వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్నప్పుడు ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ట్రావెల్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన పలువురు వ్యక్తులు ఈ యుద్ధంలో పోరాడేలా చేయబడ్డారు.
