AP Rains : అమరావతి : ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం వరకు అప్రమత్తంగా ఉండాలని, పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు (AP Rains) కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (IMD) . ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళా ఖాతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు.
AP Rains Update
వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
శనివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆదివారం కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
నిన్న సాయంత్రం 6 గంటల నాటికి మన్యం జిల్లా నవగాంలో 73 మిమీ, విజయనగరం జిల్లా పాతకొప్పెర్లలో 68 మిమీ, మన్యం జిల్లా సీతంపేటలో 59.7 మిమీ, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 55మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Also Read : YS Sharmila Fired on YS Jagan : ఆ ముగ్గరు ఏపీని ఢిల్లీకి తాకట్టు పెట్టారు : షర్మిల
