శ్రీ సత్యసాయి జిల్లా : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. తన హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్వీర్యం చేసిన ఘనత జగన్ కే దక్కిందన్నారు. దమ్ముంటే తన హయాంలో చేసిన అభివృద్ది ప్రస్తుతం తమ రెండేళ్ల కాలంలో ఏపీలో అమలు చేసిన పనులు, కార్యక్రమాలు, సంక్షేమ పథకాలలో ఎవరు ఏం చేశారో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు ఎస్. సవిత.
గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి, సంక్షేమం రెండేళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టినట్లు వివరించారు. గోరంట్ల మండలంలోనే సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.93 లక్షలు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.70 లక్షలు వెచ్చించామన్నారు. రూ.5 కోట్లతో ఓనవోలు – కొలింపల్లి బీటీ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. నెల రోజుల్లో ఓనవోలు – గుంటుపల్లి రోడ్డును పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఇవే కాక మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రెండేళ్ల కూటమి పాలనపైనా, 5 ఏళ్ల వైసీపీ పాలనపైనా చర్చకు సిద్ధమని మంత్రి సవిత సవాల్ విసిరారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం(సర్) పై ఎవరూ నిర్లక్ష్యం చూపొద్దని, బీఎల్వోలు అడిగిన సమాచారం అందజేయాలని, లేకుంటే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరూ ఎన్నికల అధికారులకు కలిసి తమ సమాచారం అందజేయాలన్నారు.
















