అమరావతి : వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి పొంది రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు . 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అరాచక, విధ్వంసక రాజకీయాలకు చరమగీతం పాడారని, ప్రజల స్పష్టమైన తీర్పును అంగీకరించలేకనే వైసీపీ నాయకులు నిరసనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ నిరసనలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించే చర్యలేనని అచ్చెన్నాయుడు అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని, ప్రతిపక్షాల గొంతు నొక్కి, భయాందోళనల వాతావరణంలో పాలన సాగించారని మండిపడ్డారు.
మహానాడు ఘన విజయాన్ని చూసి అసూయ, అక్కసు, ద్వేషంతో రగిలిపోతున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫేక్ బుక్లెట్ విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్ పాలన అంటే అభివృద్ధికి గొడ్డలి పోటు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు, రాష్ట్ర భవిష్యత్తుకు వినాశనం అని మండిపడ్డారు. జగన్ చరిత్ర మొత్తం చూస్తే గొడ్డలి పోటు, వెన్నుపోటుకు నిలువెత్తు నిర్వచనమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులను కాపాడుతూ న్యాయాన్ని ఖూనీ చేసిన వ్యక్తి జగనేనన్నారు. తెలంగాణకు చెందిన శివకుమార్ స్థాపించిన పార్టీని కబ్జా చేసి తన సొంత పార్టీగా మార్చుకున్న వ్యక్తి జగనేనన్నారు. తల్లి, చెల్లికి సైతం న్యాయం చేయకుండా మహిళా ఆస్తి హక్కులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్దేనని విమర్శించారు. తన అవలక్షణాలను ప్రత్యర్థులపై రుద్దడం, చెప్పిన అబద్ధాన్ని వందసార్లు చెప్పడం జగన్ రాజకీయ శైలిగా మారిందన్నారు.
