చెన్నై | రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చెన్నై వేదికగా జరిగిన తమిళనాడు శాసన సభ సమావేశంలో ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న వివాదంపై స్పందించారు. ఎందుకు కొత్తగా కొలువుతీరిన టీవీకే సర్కార్ శ్రద్ధ చూపడం లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ అక్కడ ఉన్నప్పటికీ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు ఉదయనిధి స్టాలిన్. కర్ణాటక ప్రభుత్వం మెకెదాటు ఆనకట్ట నిర్మాణానికి ఆసక్తి చూపుతోందని ఆరొపించారు. ఈ విషయంలో ముందడుగు వేస్తోందని హెచ్చరించారు ఉదయనిధి స్టాలిన్.. కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే మెకెదాటు ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా మేమంతా ఏకతాటిపై ఉన్నామని మనం కూడా నిరూపించు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు మెకెదాటు ఆనకట్ట అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయని అన్నారు. ఈ విషయంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని అందరూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కర్ణాటకలో పర్యటిస్తారని తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఒకరు చెప్పగా, ఆ విషయం ఇంకా పరిశీలనలో ఉందని మరో మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత, తమిళనాడు ముఖ్యమంత్రి కర్ణాటకకు రావద్దని కర్ణాటక ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా లేదా? ముఖ్యమంత్రి కర్ణాటక పర్యటనకు ప్రణాళిక వేస్తారా లేదా? ఎన్నికల హామీలలో మీరు రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఒకవేళ మీకు మరింత సమయం కావాలని మీరు భావిస్తే, అందుకు ఎంత సమయం అవసరమో స్పష్టం చేయాలని ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు.
