హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అత్యున్నతమైన పౌర పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఎంపిక చేసింది. కాగా పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించనున్నార ఈ విషయాన్ని సోమవారం ప్రభుత్వం అధికారిక ప్రకటన లో తెలిపింది. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్ పురస్కారం లభించింది.
ఆయనతో పాటు విభిన్న రంగాల్లో సేవలందించిన వారికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన తర్వాత పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ఘనంగా సన్మానించనున్నారు. గతంలో పద్మ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవితో పాటు ఇతరులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. అదే మాదిరి ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించనున్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్.

















