అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, బోధనా నాణ్యతను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. దేశ చరిత్రలోనే ఒక వినూత్న ప్రయోగంగా, మన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై శిక్షణ పొందుతూ, గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్నారు. దీనిలో భాగంగా, 2025లో ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ పొందిన 37 మందికి అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞానాన్ని అందించేందుకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, సీఎం నారా చంద్రబాబు నాయుడు ‘ఫ్యూచర్ రెడీ’ సంకల్పం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ ప్రశంసనీయం.
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచంలోని ఏ మూలన ఉన్న విద్యార్థితో నైనా పోటీ పడాలన్నది సీఎం ఆకాంక్ష. దానికి పునాది పాఠశాల నుంచే పడాలని, కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా బోధనా నాణ్యతను పెంచేందుకు ఆయన ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నారా లోకేష్ ప్రత్యేక చొరవ: ‘డిజైనింగ్ లెర్నింగ్ – ఇన్స్పైరింగ్ థింకింగ్ . ఈ దిశగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ ప్రతి నిర్ణయంలోనూ ‘అంతర్జాతీయ ప్రమాణాల’ను జోడిస్తున్నారు. సింగపూర్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (NIE), ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ తుర్కు(University of Turku)లతో ఒప్పందాలు కుదుర్చు కోవడం వంటి గ్లోబల్ నెట్వర్కింగ్ లో ఆయన కీలక పాత్ర పోషించారు.
















