కర్ణాటక : దేశ వ్యాప్తంగా కలకలం రేపిన బళ్లారి హింసాత్మక ఘటనకు సంబంధించి శుక్రవారం పోలీసులు కీలక ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో కాల్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నేత శ్రీరాములుతో సహా 11 మందిపై కేసు నమదు చేశారు. నిందితులపై హత్యాయత్నం, చట్ట విరుద్ధంగా గుమిగూడటం, అల్లర్లు సృష్టించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఎస్పీ సర్కిల్ సమీపంలో వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.
జనవరి 1వ తేదీన సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల మధ్య జనార్దన రెడ్డి నివాసానికి సమీపంలో ఉన్న సిరుగుప్ప రోడ్డు వద్ద విగ్రహావిష్కరణ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లను చించివేశారని ఫిర్యాదులో ఆరోపించారు . గురువారం రాత్రి బళ్లారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జరిగిన హింసాకాండకు సంబంధించి గంగావతి ఎమ్మెల్యే , మాజీ మంత్రి జనార్దన రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి బి శ్రీరాములుతో సహా 11 మందిపై బ్రూస్పేట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. జనవరి 2వ తేదీన తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో బళ్లారిలోని మోకా రోడ్డు నివాసి చానల్ శేఖర్ ఈ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
















