హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్వాకంపై సీరియస్ కామెంట్స్ చేశారు ఎంపీ ఈటల రాజేందర్. రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్న కాంగ్రెస్ తీరును ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఫీజులు కట్టలేకపోతే కాలేజీలలో నిలబెట్టినప్పుడు పిల్లలు, వారి తల్లిదండ్రులు తమ ఆవేదనని మాకు చెప్పుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు, చేతలు చూస్తే జాలి వేస్తుందన్నారు. కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్టు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు కానీ ఆక్స్ఫర్డ్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ.
ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, లండన్ స్కూల్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు , ఆ దేశాల చరిత్ర వందల సంవత్సరాలే కానీ భారత దేశ చరిత్ర వేలాది సంవత్సరాలు. ఆశ్రమ పాఠశాలలు ఉన్న దేశం మనది అని గుర్తు చేశారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడటం సీఎంకు అలవాటుగా మారిందన్నారు. నలంద, తక్షశిల విశ్వ విద్యాలయాలు ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దాయని చెప్పారు. నువ్వు చెప్తున్న యూనివర్సిటీల కంటే వేల రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. నీ ఫిలాసఫీ అబద్ధాలు. ప్రజలు నమ్ముతారు అని అనుకుంటున్నావు కానీ నీ మాటలు చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తల దించుకుంటోందని పేర్కొన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం దిగ్గజాలు చదువుకున్నది ఇక్కడి యూనివర్శిటీలలోనేనని గుర్తించాలన్నారు. సోరోస్ ఫౌండేషన్ దేశ భద్రత, స్వేచ్ఛ, సార్వభౌమాదికారాన్ని, భారత జాతిని విచ్చినం కోసం ఫండింగ్ చేస్తున్న సంస్థ అని, ఆయన్ని కలిసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.


















