అమరావతి : ఏపీ చేనేత సంక్షేమ శాఖకు తీపి కబురు చెప్పారు మంత్రి ఎస్. సవిత. ఢిల్లీలో మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా యూనిట్ ఏర్పాటుతో రాష్ట్రంలో సర్క్యులర్ టెక్స్టైల్ ఎకానమీ, పర్యావరణ పరిరక్షణ, వనరుల సమర్థ వినియోగంతో పాటు ఉపాధి అవకాశాలకు ఊతం లభించనుందని వెల్లడించారు మంత్రి. విశాఖలో రూ.100 కోట్లతో ఆధునిక గార్మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు మరో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. మరో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో గార్మెంట్ రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, మూడు వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు ఆధునిక మార్కెట్ లభించేలా నాసిక్ కు చెందిన కేప్స్ ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త డిజైన్ల అభివృద్ధి, మార్కెట్ ధోరణులకు అనుగుణంగా విలువ ఆధారిత ఉత్పత్తుల రూపకల్పనపై చేనేత కార్మికులకు సాంకేతిక సహకారం అందనుందని పేర్కొన్నారు.
ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్ లోని ఆధునీకరించిన లేపాక్షి షోరూమ్ ను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా లేపాక్షి షో రూమ్ లను పలు దేశాల్లో ప్రారంభించే ఆలోచన చేస్తున్నామన్నారు. దేశంలోనూ హస్త కళారూపాలకు మార్కెటింగ్ కల్పించడానికి ప్రణాళికులు అమలు చేస్తున్నామన్నారు సవిత. ఇందులో భాగంగా లేపాక్షి షో రూమ్ లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. కొత్త షో రూమ్ లను ప్రారంభిస్తున్నామన్నారు. నేరుగా ఇళ్లకే హస్త కళారూపాలు పంపేలా సోషల్ మీడియా, ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు చేస్తున్నామన్నారు. విదేశాలకు హస్త కళల గిఫ్ట్ బాక్స్ లు సరఫరా చేస్తున్నామన్నారు. సింగపూర్లోని భారత రాయబార కార్యాలయానికి 500 హస్తకళారూపాల గిఫ్ట్ బాక్స్ లను, హాంకాంగ్, ఇతర దేశాలకు హస్త కళారూపాలను సరఫరా చేస్తున్నామన్నారు.
















