అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని వెంకుపాలెంలో అంగరంగ వైభవోపేతంగా శ్రీ జగన్నాథ రథయాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ఆయన శ్రీ జగన్నాథుడి రథాన్ని లాగారు. ఇదిలా ఉండగా రథాన్ని లాగడానికి ముందు శ్రీ జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి, అలాగే రథం వెళ్లే మార్గాన్ని నీటితో శుభ్రం చేశారు. అనంతరం శ్రీ జగన్నాథుని రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే శ్రీ శ్రావణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ జగన్నాథుడి రథం కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి తలమానికంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి రాజధానికి పక్కనే శ్రీ జగన్నాథుడి రథం కార్యక్రమం జరగడం పట్ల సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దేవాలయాల పురోభివృద్దికి నడుం బిగించినట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రథాన్ని లాగడం , పూజలు చేయడం మరిచి పోలేనన్నారు.



















