విశాఖపట్నం జిల్లా : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రాష్ట్రం గురించి. విశాఖపట్నంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను విధుల్లోకి చేర్చే కార్యక్రమంలో భాగంగా శనివారం రక్షణ మంత్రి మాట్లాడారు. భారత రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త శక్తి కేంద్రంగా ఆవిర్భవించింది అని అన్నారు. గాలి, నీరు, భూమి , మానవ రహిత రంగాలలో ఏపీ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని చెప్పారు. పుట్టపర్తిలో ‘అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్’ కోసం ‘కోర్ ఇంటిగ్రేషన్ , ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్సకు తాము ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు రాజ్ నాథ్ సింగ్. అనకాపల్లి జిల్లాలో ‘భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యొక్క కొత్త ‘నావల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం’కు కూడా శంకుస్థాపన జరిగిందని తెలిపారు.
ఇక్కడ స్వయంప్రతిపత్తితో పనిచేసే నీటి అడుగున వాహనాలు , టార్పెడోలు, నీటి అడుగున రక్షణ వ్యవస్థలు తయారు చేయడం జరుగుతుందన్నారు. అంటే, ఒకప్పుడు మనం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఆయుధ వ్యవస్థలు ఇకపై మన విశాఖపట్నం సమీపంలోనే ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు రాజ్ నాథ్ సింగ్. ఆకాశంలో AMCA, సముద్ర గర్భంలో BDL నావల్ వ్యవస్థలు, మానవ రహిత రంగంలో కర్నూలు డ్రోన్లు , నేడు సముద్ర ఉపరితలంపై INS మహేంద్రగిరి – ఇవన్నీ గాలి, నీరు, భూమి , మానవ రహిత రంగం వంటి ప్రతి విభాగంలోనూ భారతదేశ రక్షణ శక్తికి ఆంధ్రప్రదేశ్ తనవంతు సహకారం అందిస్తోందని సూచిస్తున్నాయి అని మంత్రి పేర్కొన్నారు.

















