అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సచివాలంలో తన అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా పర్యాటక రంగం పై ఫోకస్ పెట్టాలన్నారు. మరో వైపు రెన్యువబుల్ ఎనర్జీ విస్తృతం కావడంతో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సోలార్ సెల్స్లో ఏపీ అగ్రగామిగా నిలవాలన్నారు. ఇంకా ఏర్పాటు చేయాల్సిన 38 ఎంస్ఎంఈ పార్కులను త్వరితగతిన ప్రారంభించాలని నిర్దేశించారు. రైల్వే టెర్మినల్స్కు ఎంస్ఎంఈ పార్కులను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. లాజిస్టిక్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో యువతకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా చూడాలన్నారు. బీపీసీఎల్, ఆమ్కా ప్రాజెక్టులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా సంప్రదింపులు జరపాలన్నారు నారా చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం పెట్టుబడి దారులకు , కంపెనీలు స్థాపించేందుకు గాను కొత్తగా పాలసీని తీసుకు వచ్చామన్నారు. ఎవరి కీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేసేలా చర్యలు చేపట్టామన్నారు సీఎం. ఇదే క్రమంలో తాము తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు . రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, దుర్గేష్, సీఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

















