అమరావతి : ఏపీని డిజిటల్ లిటరసీ (అక్షరాస్యత)లో భారత దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన సమాచార నెట్ వర్క్ కు సంబంధించి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టెక్నాలజీ రోజు రోజుకు మారుతోందని, ఇందులో భాగంగా ప్రతిదీ మొబైల్ ద్వారా పనులు అవుతున్నాయని, దీనిని వాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇది కేవలం మంచి కోసమే వాడాలని సీఎం సూచించారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల్లో డిజిటల్ లిటరసీకి కూడా సర్వీసు ప్రొవైడర్లు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా అందిస్తున్న వివిధ సేవలు, సంజీవని పథకం సహా వివిధ టచ్ పాయింట్ ల సేవల్ని సమర్ధంగా వినియోగించుకునేలా ఈ డిజిటల్ లిటరసీ ఉపకరిస్తుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలను డిజిటల్ లిటరేట్లుగా మారిస్తే మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కువ సేవలు అందించేందుకు అస్కారం ఉంటుందన్నారు. త్వరలో ఏఐ ఆగ్రానమిస్ట్, ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్ లాంటి వేర్వేరు సేవల్ని వినియోగదారులు ఉపయోగించు కునేందుకు అవకాశం ఉందని వివరించారు సీఎం .
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాతిపదికన అన్ని ప్రాంతాలకూ పూర్తి మొబైల్ కవరేజి అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమీక్షకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ , బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, జియో, వోడా ఫోన్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.


















