చెన్నై : భారత జట్టు మాజీ క్రికెటర్ , అనలిస్ట్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై వేదికగా జరిగిన కీలకమైన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. ఇది అరుదైన రికార్డ్. ఈ మ్యాచ్ గెలుపొందడంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. తను కేవలం 54 బంతులు మాత్రమే ఎదుర్కొని 10 ఫోర్లు 6 సిక్సర్లు కొట్టాడు. అకీల్ హుస్సేన్ 4 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి 4 కీలకమైన వికెట్లు కూల్చాడు చెన్నై బౌలర్. తనతో పాటు నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఈ సందర్బంగా సంజు శాంసన్ చివరి దాకా ఉండడం, సెంచరీ కోసం వేచి ఉన్నాడని కొందరు విమర్శించడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు రవిచంద్రన్ అశ్విన్.
శతకం కోసం సంజు సామ్సన్ నెమ్మదించాడని ఫ్యాన్స్ లేదా ఇంకొందరు వ్యతిరేకులు అనవచ్చు, కానీ 54 బంతుల్లో 100 పరుగులు చేయడం ఎప్పుడూ నెమ్మది కాదన్నాడు. సంజు శాంసన్ మరిన్ని సాహసాలు చేసి ఉండవచ్చని అనిపించవచ్చు. కానీ తన వెనుక బలమైన బ్యాటింగ్ మద్దతు లేదని అతనికి తెలుసు అని పేర్కొన్నాడు. అతను తెలివిగా క్రికెట్ ఆడాడు. బ్రెవిస్, దూబే, కార్తీక్ శర్మ క్రీజులో ఉన్నప్పుడు, వారిని స్పిన్నర్లపై దాడి చేయనిచ్చి, చెత్త బంతులను దండించడంపై దృష్టి పెట్టాడని తెలిపాడు. అతను షార్ట్ బాల్స్, స్లో డెలివరీలను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడని చెప్పాడు ఆర్. అశ్విన్. థర్డ్ మ్యాన్, పాయింట్ వంటి తనకు అంతగా పట్టులేని ప్రాంతాలలో కూడా వేగాన్ని అద్భుతంగా వాడుకున్నాడని ప్రశంసలు కురిపించాడు. ఇది చాలా తెలివైన, చక్కగా ప్రణాళిక వేసుకున్న ఇన్నింగ్స్ గా అభివర్ణించాడు.


















