అమరావతి : కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్వచ్చంధంగా భూములు ఇచ్చిన రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలపై కీలక హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలను సీఆర్డీఏ అధికారులు , కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, అనుకూలమైన పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇటీవల తమ భూములను క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (కి అప్పగించిన అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చెందిన రైతులు, ఆదివారం నాడు కొలనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను కలిశారు.
ల్యాండ్ పూలింగ్ , లేఅవుట్ ప్రణాళికకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి, మద్దతు తెలిపినందుకు రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం సందర్భంగా, వాణిజ్య ప్లాట్ల కేటాయింపు, రహదారి అనుసంధానానికి సంబంధించిన సమస్యలు , లేఅవుట్కు సంబంధించిన కొన్ని అంశాలను వారు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమస్యలు ప్రధానంగా అమరావతి ల్యాండ్ పూలింగ్ మొదటి దశలో పాల్గొనకుండా, ఇప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం తమ భూములను ఇచ్చిన రాయపూడి రైతులకు సంబంధించినవి ఉన్నాయి.


















