అమరావతి : ఏపీ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ . ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు లోకేష్ అని కితాబు ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఆనాటి పరిస్థితులు దారుణంగా ఉండేవన్నారు. సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వేధింపులకు గురి చేశారని, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఒకరకంగా చెప్పాలంటే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజులను తలపింప చేసేలా జగన్ రెడ్డి పాలన సాగించారని ధ్వజమెత్తారు.
కాగా యువగళం పాదయాత్ర లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నారా లోకేష్ రాష్ట్రం బాగు కోసం ఎక్కడా వెనుకడుగు వేయ లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడటం లోకేష్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా తెలుగుదేశం ను ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు లోకేష్ శ్రీకారం చుట్టారన్నారు . ఇన్సూరెన్స్ పాలసీ కార్యకర్తలకు అందుబాటులో కి తీసుకు రావడంతో పాటు కోటి మంది సభ్యులతో పార్టీని బలోపేతం చేయటం మామూలు విషయం కాదన్నారు.


















