హైదరాబాద్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్బంగా కడియం గురించి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పాడో, ఎలా దారుణంగా కామెంట్స్ చేశాడో వినిపించే ప్రయత్నం చేశారు. కడియం శ్రీహరి నిజంగానే మాల, మాదిగ కులమా కాదా అని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి అసలు ఏ కులానికి చెందినవాడో నిరూపించుకుని, ఆయన శీలాన్ని కాపాడుకోవాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడని, అది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. నోరు జారడం, ఆపై క్షమాపణలు చెప్పక పోవడం కాంగ్రెస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు అలవాటుగా మారిందన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
అసలు కడియం శ్రీహరి గురించి మాట్లాడడం కూడా దండగేనని అన్నారు. మోసం చేయడం, అబద్దాలు చెప్పడం, పార్టీలు మారడం కడియం నైజమని ఆ విషయం వరంగల్ జిల్లా వాసులకు బాగా తెలుసన్నారు. ఆనాడు దివంగత ఎన్టీఆర్ ను మోసం చేశాడు. ఆపై పదవి కోసం చంద్రబాబు నాయుడు పంచన చేరాడని, చంద్రబాబుకు చెక్ పెట్టి కేసీఆర్ వద్దకు చేరాడు..ఇప్పుడు ఎన్నికల సమయంలో పదవి కోసం రేవంత్ రెడ్డి పంచన చేరాడని ఎద్దేవా చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాబోయే కాలంలో ఇంకెన్ని పార్టీలు మారతాడో తెలియదన్నారు. ప్రజలు తన నిర్వాకం చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారని పేర్కొన్నారు.

















