అమరావతి : రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను గమనించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా వెంటనే చర్యలు చేపట్టారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.83 లక్షల హెక్టార్లలో సాగు జరిగి 37 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి నమోదైనప్పటికీ, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసర అవసరాల నిమిత్తం రైతులు తక్కువ ధరలకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని వివరించారు.
ఈ పరిస్థితుల్లో తక్షణమే కేంద్రం జోక్యం అవసరమని ముఖ్యమంత్రి కి స్పష్టం చేశారు. రైతులకు న్యాయమైన ధర కల్పించాలనే లక్ష్యంతో ధర లోపం చెల్లింపు (పిడీపీఎస్ స్కీం) ను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎమ్ ఐ ఎస్) ద్వారా అమలు చేయాలని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు 100% నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేలా చేయాలని కోరారు. అలాగే ప్రస్తుత 25% పరిమితిని 100% ఉత్పత్తికి విస్తరించి, జూన్ 2026 వరకు పథకాన్ని కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి లేఖ రాశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.


















