అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమ రాజుతో పాటు కూటమి నేతలపై కొందరు పనిగట్టుకుని దాడులకు పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని స్పష్టం చేశారు. ఉండి నియోవర్గం ఆకివీడు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఉన్న పురాతన ఆలయానికి పూజకు వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజుపై, కూటమి నాయకులపై కొందరు దాడి చేయడం దారుణమన్నారు.
దశాబ్దాలుగా నిరాదరణకు గురైన రామాలయ పునరుద్ధరణకు పూనుకున్న డిప్యూటీ స్పీకర్…పూజలకు వెళ్లిన సమయంలో, బయటి వ్యక్తులతో కలిసి కొంతమంది ఆయుధాలతో దాడికి తెగబడటం గర్హనీయం అని పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు ఆయుడు. భక్తి శ్రద్ధలతో పండుగ జరుపు కోవాల్సిన పవిత్ర సమయంలో ఇటువంటి సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ రోజు జరిగిన దాడిలో కొందరు గాయపడి ఆసుపత్రి పాలవ్వడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యహరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
















