మంగళగిరి : సుదీర్గమైన రాజకీయ నేపథ్యం , ఘనమైన వారసత్వం , చరిత్ర కలిగిన పార్టీ టీడీపీ అని అన్నారు మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని అన్నారు. పార్టీలో పనిచేసే వారిని గుర్తించేందుకు యాప్ తీసుకు వచ్చమని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల పని చేసే వారిని, చేయని వారిని గుర్తించవచ్చు అని పేర్కొన్నారు. ఓవైపు శిక్షణ తరగతులు, మరోవైపు ‘మై టీడీపీ’ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం అని చెప్పారు . ఓ కార్యక్రమానికి పిలుపునిస్తే దానిని సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
2019 నుంచి 2024 వరకు జగన్ రెడ్డి హయాంలో మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. అక్రమ కేసులు పెట్టారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపైనే దాడి చేశారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో బంధించారు. దీంతో అందరం ఉద్యమించాం. ఆ ఉద్యమం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 94 శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుందని అన్నారు. వైసీపీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. ఇందుకు వారి అహంకారమే కారణం. నాకు రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీ వచ్చిందని అహంకారానికి పోకూడదు. అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. కులాలకు అతీతంగా అందరూ నాకు ఓటేశారు కనుకనే అంత మెజార్టీ వచ్చిందన్నారు. నాపై బాధ్యత పెరిగింది. నా పనులు సక్రమంగా చేస్తున్నాను. దీనిని అందరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు అహంకారాన్ని ఒప్పుకోరు. అది గమనించాలని అన్నారు నారా లోకేష్.


















