హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు 1300 చెరువులు ఉండేవన్నారు. ఇందులో 700 చెరువులు మాయం అయ్యాయని, ఇందులో 60 శాతానికి పైగా కబ్జాకు గురైనట్లు చెప్పారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఆక్రమణలను తొలగించాలని పేపర్లలో ఉంటుంది. లిఖిత పూర్వక ఆదేశాలుంటాయి. కాని అవి అమలు కాని పరిస్థితి గతంలో ఉండేది. మాధాపూర్లోని తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ పరిధిలోని ఎన్ కన్వెన్షనే ఇందుకు ఉదాహరణ. హైడ్రా వెంటనే ఆ పని చేసి 14 ఎకరాలకు కుంచించుకు పోయిన తమ్మిడికుంటను 29 ఎకరాలకు విస్తరించింది. ఇదే పరిస్థితి నగరంలోని అన్ని చెరువులదీ. ఈ ఆక్రమణలను తొలగించినప్పడు కొంతమంది విమర్శించారు. నేడు వారే అభినందిస్తున్నారు.
వేలాది మంది చెరువుల చెంత సేదదీరుతున్నారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు పిక్నిక్ స్పాట్గా మారుతున్నాయి. హైడ్రా చర్యల వల్ల అందరికీ చెరువుల ఎప్టీఎల్, బఫర్ అంటే తెలిసింది. ఇప్పడు రియల్టర్లు చెరువుల ఎప్టీఎల్, బఫర్ పరిధిలో ఇళ్లు నిర్మించడం లేదు. ప్రజలు కొనడానికి ముందుకు రావడం లేదు. హైడ్రా చర్యలతోనే ఇది సాధ్యమైందన్నారు కమిషనర్ రంగనాథ్. భవిష్యత్ తరాల అవసరాల మేరకు చెరువులు, నాలాలను పరిరక్షించుకంటూ.. పర్యావరణ హితమైన నగర నిర్మాణమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోందని హైడ్రా కమిషనర్ చెప్పారు. బడా బాబుల ఆక్రమణలు తొలగించి 1350 ఎకరాల ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూములను కాపాడాం. చెరువులను పునరుద్ధరిస్తున్నాం. కబ్జాల పట్ల మౌనంగా ఉంటే మన మనుగడే ప్రమాదకరం అవుతుందన్నారు.

















