హైదరాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పట్టుబడడం, కాల్పులకు పాల్పడడం సంచలనం రేపింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇందులో టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బీజేపీకి చెందిన ఇంకొకరు ఇందులో ఉన్నట్లు రాష్ట్ర ఈగిల్ టీం ఎస్పీ గిరిధర్ సంచలన వివరాలు వెల్లడించారు. దీనిపై ఆదివారం టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 11 మంది డ్రగ్స్ వాడినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు.
ఇది చాలా సున్నితమైన, దారుణమైన నేరం అని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, డ్రగ్స్ అన్ని చోట్లా రవాణా చేయబడ్డాయని ఆరోపించారు. చాలా మంది యువకులు డ్రగ్స్ కు అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ పై కూడా సందేహాలు ఉన్నాయని అన్నారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సవాల్ చేశారు కానీ కేటీఆర్ రాలేక పోయారన్నారు. ఇప్పుడు కేటీఆర్ బ్యాచ్ అంతా డ్రగ్స్ కు అలవాటు పడినట్లు తేలి పోయిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మాకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయి, కేటీఆర్ పరీక్షకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నానని సవాల్ విసిరారు. రేపు అసెంబ్లీ సమావేశం జరగబోతోందని చెప్పారు.

















