కరీంనగర్ జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాపోయారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉనప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని చెప్పాడు, కానీ నేను ఓట్లతో కొడదామని చెప్తున్నానని అన్నారు. నా గొంతు కొద్దామని చూస్తున్నారని, నా గొంతు కోయాలంటే ముందు భుజాల లాంటి నా కార్యకర్తలను దాటి రావాలని హెచ్చరించారు. జీవితం అయిపోయే ముందు నాకు దుఃఖం తెప్పించారంటూ భావోద్వేగానికి లోనయ్యారు జీవన్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్నాడు.. నేడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాటలకు భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నడుచుకోవడం పట్ల ఆవేదన చెందారు మాజీ మంత్రి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూనే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను ఎలా ప్రోత్సహిస్తారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్లో దొంగలు పడ్డారు.. కాంగ్రెస్ గుర్తుని ఎత్తుకెళ్లారని సంజయ్పై ఫైర్ అయ్యారు. సంజయ్ని రాళ్లతో కాదు ఓట్లతో కొట్టి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారు జీవన్రెడ్డి

















