అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నదుల అనుసంధానం జరగాలని, ప్రతీ ఎకరాకు నీరందించటమే భూమాతకు ఇచ్చే మనమిచ్చే జలహారతి అని స్పష్టం చేశారు. గతంలో నీటి పరిరక్షణ కోసం వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశామన్నారు. అడవుల చుట్టూ కాంటూర్ ట్రెంచ్ లు తవ్వి, ప్రతీ చోటా భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పారు . 2019-24లో తిరుమలలో లడ్డూ ప్రసాదాన్ని గత పాలకులు కల్తీ చేశారని ఆరోపించారు. రసాయనాలు కలిపి దాన్ని నెయ్యిగా సరఫరా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాపాపం చేసి భగవంతుడి పట్ల ఘోర అపచారం చేశారని అన్నారు. రూ.20 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.
ఆ పరిశ్రమలన్నింటికీ నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయానికి 900 టీఎంసీలు, పరిశ్రమలకు 40 టీఎంసీలు, తాగు నీటి కోసం 200 టీఎంసీల నీరు అవసరం అన్నారు. ప్రతీ ఏటా 1300 టీఎంసీల నీటితో మన రాష్ట్ర అవసరాలు తీరుతాయన్నారు.
40 నదులు, 38 వేల చెరువులు ఉన్నాయన్నారు. వీటన్నిటిలో 1300 టీఎంసీలకుపైగా నీటిని నిల్వ చేసుకోగలం అన్నారు. ఈ ఏడాది 862 టీఎంసీల నీళ్లు మన జలాశయాల్లో జల కళతో కళకళలాడుతున్నాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. నీటి వనరుల వివరాలను డిజిటలైజ్ చేసి నీటి నిల్వలు, వినియోగం వివరాలు తెలిసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.

















