అమరావతి : తిరుమల లడ్డూ వివాదంపై శాసన సభలో ప్రత్యేకంగా చర్చకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. కల్తీ నెయ్యి కొనుగోలు, సరఫరాకు ఆనాడు జగన్ రెడ్డి సర్కార్ పావులు కదిపిందని ఆరోపించారు. శ్రీవారి నిధుల నుండి రూ. 233 కోట్లు దోచుకుందని సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు నుండి తీసిన రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారని జనసేన సర్వసభ్య సమావేశం స్పష్టంగా పేర్కొంది. మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో, సీబీఐ నేతృత్వంలోని సిట్ తన ఛార్జిషీట్లో ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని చెప్పలేదని పార్టీ పేర్కొంది.
వైఎస్సార్సీపీ నాయకులు తమకు క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు. దేవాలయానికి ధర్మకర్తలుగా ఉండాల్సిన వారే అనైతిక చర్యలకు పాల్పడటం అత్యంత సిగ్గుచేటు అని అన్నారు పవన్ కళ్యాణ్. వైఎస్సార్సీపీ పాలనలో నువ్వుల నూనె కంటే తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేశారని ఆరోపించారు. దానిలోని ప్రతి చుక్కా కల్తీ చేశారన్నారు. ఆవు పాలు, వెన్న లేకుండా నెయ్యిని సృష్టించడం శాస్త్రవేత్తలకు కూడా సాధ్యం కాదన్నారు. కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే అది చేయగలదంటూ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందనేది 100 శాతం నిజం అన్నారు. రసాయనాలతో తయారు చేసిన పదార్థాన్ని నెయ్యిగా ప్రదర్శించి, దానితో 20 కోట్ల లడ్డూలను తయారు చేసి ప్రసాదంగా విక్రయించారని ఆరోపించారు.

















