విజయవాడ : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు జగన్ రెడ్డి. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక NDDB, NDRI ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైందని అన్నారు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయ పరచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారని అన్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, మీ తప్పులను దాచి పెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు జగన్ రెడ్డి. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడుల పరంపర అని మండిపడ్డారు.
ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా, మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు, జోగి రమేష్ లను లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనం అన్నారు. ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం అన్నారు.

















