విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ బక్వాస్ అంటూ మండిపడ్డారు. ఎన్డీయేలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నా ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేక పోయారంటూ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పై విజయవాడలో స్పందించారు షర్మిలా రెడ్డి. రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా. బాబు అండతో ప్రధానిగా నిలబడ్డ మోడీ వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ప్రతి సారి బడ్జెట్ లో ఏపీకి చేస్తున్నది ఘరానా మోసమే తప్పా మరోటి కాదన్నారు షర్మిలా రెడ్డి. 50 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ సారి సైతం రాష్ట్రానికి మొండి చెయ్యే చూపించారని ఆరోపించారు.
ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రయోజనాలకు బడ్జెట్ లో అనా పైసా మందం విలువ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్. ఇది ఆంధ్రప్రదేశ్ ను దగా చేసిన బడ్జెట్ అని ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజలను ఊరించి ఉసూరు మనిపించిన బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. అమరావతికి మళ్ళీ అప్పులే తప్ప ఆపన్నహస్తం అందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనకబడిన ఉత్తరాంధ్రకు ఊతమివ్వలేదని అన్నారు. రాయలసీమకు మోసమే తప్ప చిల్లిగవ్వ దక్కలేదని ధ్వజమెత్తారు షర్మిలా రెడ్డి. జీవనాడి పోలవరానికి జీవం పోయ లేదన్నారు. విభజన హామీల్లో ఒక్క దానిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

















