విజయవాడ : మాజీ మంత్రి జోగి రమేశ్ నిప్పులు చెరిగారు. తనను, తన కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నారో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఇబ్రహ్నీంపట్నంలో తన ఇంటిపై జరిగిన దాడిపై ఆయన స్పందించారు. తన నివాసంపై పెట్రోల్ బాంబులతో తెగబడ్డారని జోగి రమేశ్ మండిపడ్డారు. తన ఇంటిపై దాడి చేసింది టీడీపీ వాళ్లేనని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సారధ్యంలోనే విజయవాడ చుట్టూ ప్రాంతాల రౌడీలు, బ్లేడు బ్యాచులు, గంజాయి ముఠాలను దింపి తన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నారని జోగి రమేశ్ ఆరోపించారు. వైసీపీ నేతలను భయబ్రాంతులకు గురి చేయాలన్నదే టీడీపీ నేతల పన్నాగమని చెప్పారు.
తమపై దాడులు చేస్తే వైసీపీ జెండాను వీడతామా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. లోకేశ్ పిల్ల చేష్టలు మార్చుకోవాలని హెచ్చరించారు. తన ఇంటికి ఎంతో దూరమో.. లోకేశ్ ఇంటికి సైతం అంతే దూరమన్నారు. తమ ఇళ్లను తగలబెట్టి తమను జైల్లో పెట్టాలనే రాక్షస ఆనందాన్ని మానుకోవాలన్నారు. అక్రమంగా తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాక్షస ఆనందం కోసం తమ ఇళ్లపై దాడులు చేస్తే ఊరుకోమని జోగి రమేశ్ హెచ్చరించారు. వైసీపీ నేతలంతా ఏకతాటిపైకి వస్తామని, మళ్లీ జగన్ ను సీఎం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మితి మీరిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకేశ్ చెప్పినట్లుగా పోలీసులుకు ప్రేక్షక పాత్ర పోషించారని జోగి రమేశ్ ఆరోపించారు.

















