విశాఖపట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు భారీ స్వాగతం లభించింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇక్కడికి వచ్చారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా పోలీసులకు కీలక సూచనలు చేశారు పవన్ కళ్యాణ్. తాను వస్తున్న సందర్బంగా ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించ వద్దని సూచించారు. ప్రజలు తమ నిత్య అవసరాల కోసం పలు ప్రాంతాలకు వెళుతుంటారని, నా ఒక్కడి కోసం వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు పవన్ కళ్యాణ్ కొణిదల.
ప్రధానంగా తాను ప్రయాణించే మార్గాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల దైనందిన కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. కార్యక్రమాల వద్ద స్వాగతించే సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా పూల బొకేలు, శాలువాలు, మొక్కలు వంటివి వెంట తీసుకు రావద్దంటూ కోరారు. అంతే కాకుండా సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు పదేపదే వాహన శ్రేణికి అడ్డుపడే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. వాహన శ్రేణిని ఎక్కడపడితే అక్కడ ఆపే ప్రయత్నాలు చేయకూడదని తెలిపారు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ సూచన చేయడం జరిగిందన్నారు జిల్లా ఎస్పీ.

















