అనకాపల్లి జిల్లా : ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగ విలువలు కాపాడేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సోమవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. నక్కపల్లిలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. అంతకు ముందు భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు వంగలపూడి అనిత. చిన్నారులకు చాక్లెట్లు, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా హోం మంత్రి ప్రసంగించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మువ్వన్నెల జాతీయ పతాకం మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలుస్తుందని స్పష్టం చేశారు అనిత వంగలపూడి. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి అంకితభావంతో పాటుపడదాం అని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర సందర్భంలో మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దేశ అభివృద్ధిలో బాధ్యతాయుత భాగస్వాములమవుదామని ప్రతిజ్ఞ చేద్దాం అని పేర్కొన్నారు. ఎందరో బలిదానాలు, త్యాగాలు చేయడం వల్లనే నేడు మనందరం స్వేచ్ఛతో బతుకుతున్నామని చెప్పారు.

















