హైదరాబాద్ : రాధాకృష్ణ సారథ్యంలోని ఆంధ్రజ్యోతి దినపత్రికతో పాటు ఏబీఎన్ న్యూస్ ఛానల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు ఆదివారం అధికారికంగా కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తూ తామేదో గొప్ప వారమని భావిస్తూ ఇష్టానుసారంగా ఏది పడితే అది రాయడం, ఆధారాలు లేకుండా అడ్డుగోలు ప్రసారాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా తమ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు తక్కలపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఇక నుంచి అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏబీఎన్ ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఏబీఎన్ టీవీ ఛానల్ చర్చల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్న రాదని నిర్ణయించింది పార్టీ అధిష్టానం. ఇటీవల జరిగిన ఏబీఎన్ టీవీ చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అవమానించేలా “గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఛానల్ వ్యాఖ్యాత వెంకటకృష్ణ పై చర్యలు తీసుకోవాలని కోరింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మీడియా ఉంది కదా అని ఇష్టానుసారం రాస్తామంటే ఊరుకోబోమని పేర్కొంది బీఆర్ఎస్ పార్టీ.

















