హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా అని ప్రశ్నించారు. ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కిందట తాము అనుమతి కోరామని ఆయన చెప్పారు. కానీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రి 10:40 గంటలకు అనుమతి ఇవ్వకుండా రిజెక్ట్ చేశారంటూ మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే తాము ఊరుకోమని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఇదిలా ఉండగా ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే తాము కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా అని ప్రశ్నించారు. అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చు కానీ తాము చేస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తారంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్ళే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారని, ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తాము ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూను గుర్తుకు తెచ్చేలా వేలాది మంది పోలీసులను పెట్టి అందరిని అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.















