హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ సంచలన ప్రకటన చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చెరిపేసేందుకు కుట్రకు తెర లేపారంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సీఎం ఎ.రేవంత్ రెడ్డిలపై భగ్గుమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను మార్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కేసీఆర్ చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారని చెప్పారు కేటీఆర్. ఉమ్మడి జిల్లాల్లో కలెక్టర్లను ప్రజలు కలిసే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
కానీ రేవంత్ రెడ్డి కావాలని కుట్రకు తెర లేపాడని ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల సంఖ్యను మార్చకపోతే కమీషన్ ఎందుకు అని ప్రశ్నించారు. ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికలు జరిగే అవకాశం లేదని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో రాకుండా చేసే కుట్రను ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. జిల్లాలను మార్చితే జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోను మార్పులు కూడా చేయాల్సి వస్తుందన్నారు కేటీఆర్.















