హైదరాబాద్ : చైనా మాంజా కాళ్లకు, రెక్కలకు చుట్టు కోవడంతో ఓ నీటి బాతు ( Lesser whistling duck) విలవిలలాడింది. హైదరాబాద్ లోని ECIL ప్రాంతంలోని యాప్రాల్ చెరువులో ప్రాణాపాయ స్థితిలో వున్న నీటి బాతును చూసిన వాళ్లు హైడ్రా కంట్రోల్ రూంకు సాయంత్రం 6.30 గంటలకు ఫోన్ చేసి సమాచారం అందించారు. హైడ్రా రెస్క్యూ టీమ్ హెడ్ స్వామి నేతృత్వంలోని బృందం రాత్రి 8 గంటల ప్రాంతంలో యాప్రాల్ చెరువుకు చేరుకుంది. బోటు వేసుకొని వెళ్ళి యాప్రాల్ చెరువులో ప్రాణాపాయ స్థితిలో వున్న నీటి బాతును కాపాడింది.
చీకటి పడిపోయినా సాహసించి నీటి బాతును కాపాడిన హైడ్రా బృందాన్ని యానిమల్ వారియర్స్ తో పాటు స్థానికులు అభినందించారు. తర్వాత చెరువులోకి ఆ నీటి బాతు ను వదిలేశారు. నిన్న జరిగిన ఈ ఘటన చైనా మాంజా ఎంతటి ప్రమాదమో మరోసారి రుజువు చేసింది. చైనా మాంజా అమ్మొద్దు, కొనొద్దు, వాడొద్దు అని ఎంత హెచ్చరించినా పట్టని ప్రజల నిర్లక్ష్యానికి ప్రాణాలతో విలవిలలాడిన ఈ పక్షి సజీవ సాక్ష్యం. ఇప్పటికైనా ఈ పట్టని తనాన్ని విడనాడాలని హైడ్రా కోరుతోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో భారీ ఎత్తున అక్రమాలకు , కబ్జాలకు గురైన చెరువులను, స్థలాలను కాపాడటంలో ముందంజలో ఉంది హైడ్రా. ఇప్పటికైనా జంతువులను ప్రేమించాలని కోరుతున్నారు నగర వాసులు. హైడ్రా అధికారులు కూడా.















