హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాకు గురైన చెరువులను కాపాడే పనిలో పడింది. ఇప్పటికే కొన్ని చెరువులను అందంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలోని బమ్-రుక్న్ – ఉద్ – దౌలా చెరువు అందంగా ముస్తాబైంది. తుది దశకు వచ్చిన అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అర్దరాత్రి పరిశీలించారు. దాదాపు రెండు కిలోమీటర్లు ఉండే చెరువు గట్టుపై నడుచుకుంటూ వెళ్తూ పలు సూచనలు చేశారు. స్థానికులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చెరువు చుట్టూ లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. చాలా స్పష్టంగా కనిపించేలా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నందున వారికి అనువైన వ్యాయామ పరికరాలను సమకూర్చాలని స్పష్టం చేశారు కమిషనర్ ఏవీ రంగనాథ్. చెరువు చరిత్రను చెపుతూ ప్రవేశ మార్గం వద్ద శిలాఫలకం అభివృద్ధి చేయాలన్నారు. ఔషధ గుణాలున్న నీటితో నిజాముల కాలంలో అలరారే చెరువు కనుక చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటాలని స్పష్టం చేశారు కమిషనర్. పిల్లలు, పెద్దలు భద్రంగా.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసేలా చెరువు పరిసరాలు తీర్చి దిద్దాలన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసి పండగ తర్వాత ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు . ఈ చెరువు పాతబస్తీకి ఓ ఐకాన్ గా ఉండాలని, ఆ దిశగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు ఏవీ రంగనాథ్.















