హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కోలుకోలేని షాక ఇచ్చింది వాహనదారులకు. నిన్నటి దాకా ప్రజా ప్రభుత్వం అంటూ ఊదరగొడుతూ వచ్చిన ప్రభుత్వం ఉన్నట్టుండి వాహనదారులకు దిమ్మ తిరిగేలా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా దివ్యాంగులకు సంబంధించి జరిగిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు వాహనదారులు ఎవరైనా సరే గీత దాటితే వేసే చలాన్లకు సంబంధించి తక్షణమే వారి బ్యాంకు ఖాతాల నుంచి రుసుము కట్ అయ్యేలా చేయాలని ఆదేశించారు. దీని వల్ల వాహనదారులకు కూడా భయం అనేది ఉంటుందన్నారు. అనుకోని ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉండదన్నారు రేవంత్ రెడ్డి.
దీంతో వాహనదారులు దెబ్బకు ఠారెత్తి పోతున్నారు. ఈ మధ్యన చలాన్లు ఎక్కువై పోయాయి. మితిమీరిన వేగం చాలా మంది పాలిట శాపంగా మారింది. ఎందరో రహదారుల్లో నిత్యం విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వాల్సిందేనంటూ మరోసారి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివరాలు సింక్ చేయండి, చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్గా డబ్బులు అకౌంట్ నుండి కట్ అవ్వాలని , దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు మరిన్ని డబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు రేవంత్ రెడ్డి.















