విశాఖపట్నం : మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు.
ప్రజా సంక్షేమంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడారు.
రైతులు, విద్యార్ధులు, మహిళల సహా అన్ని వర్గాలకు అన్యాయం చేశారంటూ ఆరోపించారు. రెండేళ్ల బాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయ రంగం కూరుకు పోయిందన్నారు. కనీసం యూరియా కూడా అందించలేని స్థితిలో కూరుకు పోయిందన్నారు బొత్స సత్యనారాయణ. అన్నదాతలను నిలువునా ముంచారంటూ మండిపడ్డారు. ఇది అసమర్థ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. 2 ఏళ్లుగా వితంతు ఫించన్ల ఊసే ఎత్తడం లేదంటూ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నిర్వాకం కారణంగా చక్కెర కార్మాగారాలు మూత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీలు అడ్రస్ లేకుండా పోయాయని అన్నారు. గతంలో రామతీర్దం ఘటనపై కూటమి పార్టీలు యాగీ చేశారని కానీ ఇప్పుడు ద్రాక్షా రామం లో శివలింగం ధ్వంసం చేస్తే ఎందుకు మౌనం వహించారంటూ ప్రశ్నించారు.
జంతుబలి కేసులో నిందితులను నడిపించడం సమంజసమా అని సర్కార్ ను నిలదీశారు బొత్స సత్యనారాయణ. ఈ సందర్బంగా డీజీపీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. క్షీణించిన లా అండ్ ఆర్డర్ కు ఇదే నిదర్శనం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో తామే ఏదో సాధించినట్లు గొప్పలు పోతున్నారంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు వైయస్.జగన్ హాయంలోనే పునాది పడిందని ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. భూసేకరణ, అనుమతులు, టెండర్లు మా హయాంలోనే పూర్తి చేయడం జరిగిందన్నారు.















